సంగారెడ్డి రూరల్ పోలీసుల వలలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా
ఇద్దరు అరెస్ట్ – బంగారం, వెండి ఆభరణాలు, వాహనాలు, కంప్యూటర్ సామగ్రి స్వాధీనం
సంగారెడ్డి, జూలై 31 (ప్రజావాణి): సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉప పోలీసు అధికారి సత్తయ్య ఆధ్వర్యంలో, వలయ పోలీసు అధికారి, పోలీసు ఉప నిరీక్షకుల సమక్షంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఇటీవల జరిగిన పలు చోరీ కేసులను ఛేదించిన వివరాలను వెల్లడించారు.
పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి ద్విచక్ర వాహనాలపై పారిపోవడానికి ప్రయత్నించగా వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో సంగారెడ్డి జిల్లా మామిడిపల్లి, బేగంపేట్ గ్రామాలతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో పలు చోరీలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.
అరెస్టైన వారిలో అంబర్పేట్కు చెందిన మునితాని అమర్ రాజ్ కుమార్ రెడ్డి అలియాస్ డాల్ (28), మీర్పేట్కు చెందిన అచ్చిగారి సాయికిరణ్ అలియాస్ ఈశ్వర్ (22) ఉన్నారు.
మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన చోరీలో ఆరు బ్యాటరీలు, ఐదు కంప్యూటర్ ప్రధాన భాగాలు, ఎనిమిది కీబోర్డులు అపహరించినట్లు, బేగంపేట్ గ్రామంలో జరిగిన చోరీలో బంగారు హారం, బంగారు చెవి రింగులు, బంగారు గొలుసు, మూడు జతల వెండి ఆభరణాలు దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది.
ప్రధాన నిందితుడు అమర్ రాజ్ కుమార్ రెడ్డిపై గతంలో వివిధ ప్రాంతాల్లో 34 చోరీ కేసులు నమోదై ఉండగా, పలుమార్లు జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల విడుదలైన అనంతరం తన సహచరులు సాయికిరణ్, షేక్ సలీమ్తో కలిసి మళ్లీ చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు. దొంగతనం చేసిన బంగారు ఆభరణాలను హైదరాబాద్లోని ఒక వ్యక్తికి విక్రయించి వచ్చిన డబ్బును ముగ్గురు పంచుకుని ఖర్చు చేసినట్లు విచారణలో తెలిసింది.
మరో నిందితుడు సాయికిరణ్పై కూడా ఐదు చోరీ కేసులు నమోదై ఉన్నాయని, జైలులో ఏర్పడిన పరిచయంతో మళ్లీ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, ఒక స్కూటీ, సెల్ఫోన్, బంగారం, వెండి ఆభరణాలు, కంప్యూటర్ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరుస్తామని తెలిపారు.
ఈ కేసును ఛేదించిన సంగారెడ్డి రూరల్ పోలీసు సిబ్బందిని ఉప పోలీసు అధికారి సత్తయ్య అభినందించారు.





