📄 ePaper
Sunday, July 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

📰 Generate e-Paper Clip

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ధర్మపురి జూలై 10 (ప్రజావాణి):

యువత చదువుకునే వయస్సులో డ్రగ్స్ జోలికి పోకుండా, మంచి మార్గంలో నడుస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ‘నశా ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా ధర్మపురి పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన డ్రగ్స్ నిర్మూలన “మిషన్ పరివర్తన్” అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఈగల్ టీంలను’ ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. యువత దేశానికి వెన్నెముక వంటివారని, వారు మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటూ తమ జీవిత ఆశయాలను సాధించాలని మంత్రి సూచించారు. కన్నవారు తమ పిల్లలపై పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశలను నిలబెట్టేలా ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. “ఒక్కసారి మాత్రమే తీసుకుంటే ఏమవుతుందిలే అనే నిర్లక్ష్య ధోరణే జీవితాలను నాశనం చేస్తుంది. డ్రగ్స్‌కు బానిసైన తర్వాత దాని నుంచి బయటపడటం ఎంతో కష్టం. అందుకే యువత వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నారు” కళాశాలలు, విద్యాసంస్థల వాటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా డ్రగ్స్ విక్రయం, వినియోగం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని మంత్రి కోరారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించినప్పుడే మత్తు రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ఒకవేళ ఎవరైనా అనుకోకుండా మత్తు పదార్థాలకు బానిసలై ఉంటే, వారి కోసం ప్రభుత్వం డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా ఉచిత వైద్యం, కౌన్సెలింగ్ అందిస్తోందని, ఎలాంటి సంకోచం లేకుండా ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి విద్యార్థులతో కలిసి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం “నశా ముక్త్ భారత్” ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, ధర్మపురి మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుముల లావణ్య, పలువురు పోలీస్ అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular