38వ డివిజన్లో లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన నెలకంటి రాము
బాధితులకు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్తో నేరుగా మాట్లాడించి భరోసా!
గోదావరిఖని జూలై 29 ప్రజావాణి :
మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాలకు గోదావరిఖనిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు 38వ డివిజన్ కార్పొరేటర్ నెలకంటి రాము తక్షణమే స్పందించి క్షేత్రస్థాయి పరిశీలనకు దిగారు.
డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ సహా వర్షపు నీరు చేరిన పలు లోతట్టు ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. ఇళ్లలోకి వరద నీరు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధితులను నేరుగా కలిసి పరామర్శించారు. నీటి నిల్వలను తక్షణమే దారి మళ్లించేందుకు కాలువలు, డ్రైనేజీ ప్రవాహాలను పరిశీలించి తగిన చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ నెలకంటి రాము బాధితుల ఇబ్బందులను వెంటనే ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ప్రజలతో ఎమ్మెల్యే ఫోన్లో నేరుగా మాట్లాడించి, సమస్యకు త్వరలోనే తగిన పరిష్కారం చూపుతామని బలమైన భరోసానిచ్చారు.
అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ… “అకాల వర్షాల వల్ల ప్రజలెవరూ అధైర్యపడవద్దు. ప్రజాప్రతినిధులుగా మేము నిరంతరం మీకు అండగా ఉంటాం. వర్షాల ప్రభావం దృష్ట్యా డివిజన్ ప్రజలంతా తగిన జాగ్రత్తలు వహించాలి. ఏ సమస్య వచ్చినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలి” అని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, బాధ్యులు దాసరి దుర్గ రాజు, చామంతి, బొంత వెంకటేష్, పవన్ తదితరులు పాల్గొని బాధితులకు సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు.




