ఘట్కేసర్, జూలై 29: గురుపౌర్ణమి సందర్భంగా శివరెడ్డిగూడలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, మహా మంగళహారతి, భజన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని కొంతం రామ్రెడ్డి, అంజిరెడ్డి, నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి, ఆధ్యాత్మిక వాతావరణంలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
అనంతరం భక్తుల కోసం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఎర్రసాని సుధాకర్ కుటుంబ సభ్యులు, రమేష్ కుటుంబ సభ్యులు దాతలుగా వ్యవహరించి, వందలాది మంది భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గురువును స్మరించుకునే గురుపౌర్ణమి ప్రతి ఒక్కరి జీవితంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే పవిత్ర దినమని పేర్కొన్నారు. సాయిబాబా బోధించిన ప్రేమ, సేవ, మానవత్వం, సమానత్వం అనే విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.





