ఘట్కేసర్, జూలై 29: గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని చౌదరిగూడలోని షిరిడీ సాయి సన్నిధి 18వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. 2008 సంవత్సరం నుంచి ఆలయ అర్చకుడు దేవి రాంబాబు ఆధ్వర్యంలో నిత్య పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ సాయి సన్నిధిని భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు.
ఈ సందర్భంగా శ్రీ షిరిడీ సాయిబాబాకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హారతులు నిర్వహించారు. గురు పౌర్ణమి విశిష్టతను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని సాయిబాబా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అనంతరం నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి భక్తులు, దాతలు, స్వచ్ఛంద సేవకులు విశేషంగా సహకరించారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి దాతలుగా నిలిచిన బైరు రమాదేవిరాములు గౌడ్ దంపతుల సేవలను భక్తులు కొనియాడారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేస్తూ, శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.




