కోహెడ,జూలై 29 (ప్రజావాణి)
సిద్ధిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలోని నునుపు సీసీ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిందని సామాజిక కార్యకర్త డాక్టర్ వేల్పుల శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు.వర్షాలు కురిసిన ప్రతిసారి ఈ రోడ్డుపై భారీ వాహనాలు, ద్విచక్ర వాహనాలు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నాయని తెలిపారు. ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు మంత్రి, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందించినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు.ఈ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు, జడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉండటంతో అధికారులు, విద్యార్థులు,వివిధ గ్రామాల ప్రజలు,కాలనీవాసులు, ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారని చెప్పారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయాందోళన ప్రజల్లో నెలకొందన్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డును పరిశీలించి ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని, రోడ్డుకు ఇరువైపులా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని సామాజిక కార్యకర్త డాక్టర్ వేల్పుల శంకర్ ప్రజాప్రతినిధులు, అధికారులను కోరారు.



