రోడ్డు సరిచేయండి.. తప్పుడు కేసులు మానండి: రైతుల ఆవేదన
చెన్నారావుపేట, జూలై 24 (ప్రజావాణి):
చెన్నారావుపేట మండల కేంద్రంలోని ఎల్లాయిగూడెం మాధవనగర్ కాలనీ నుంచి తిమ్మరాయినీపహడ్కు వెళ్లే వ్యవసాయ బాట చిన్న వర్షానికే గుంతలమయంగా మారి రైతులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు కాట కుమారస్వామి తెలిపారు.
రహదారిని జేసీబీతో చదును చేసి మొరం పోసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని ఆయన పేర్కొన్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం చూపాల్సింది పోయి తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని రైతులు ఆరోపించారు.
ఈ రహదారి సమస్యపై ఎన్నో ఏళ్లుగా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఒక్కసారైనా ఈ దారిలో ప్రయాణించి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించాలని కోరారు.
అలాగే దాతలు ముందుకు వచ్చి గుంతలను పూడ్చేందుకు సహకరించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశముందని వారు హెచ్చరించారు.
రోడ్డు సరి చేయండి తప్పుడు కేసులు మానండి రైతుల ఆవేదన
RELATED ARTICLES




