ఘట్కేసర్, ఏప్రిల్ 19 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని మాధారం గ్రామంలో ఆదివారం సంస్కృతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో ఉన్నత భారత్ అభియాన్ కార్యక్రమం కింద ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని స్ఫూర్తి ఆర్గనైజేషన్ అనుబంధంగా, ఎస్వి ఫిజియో & రిహాబిలిటేషన్ సెంటర్ సహకారంతో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. శిబిరాన్ని ఉద్దేశించి స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య, ఎస్వి ఫిజియో & రిహాబిలిటేషన్ సెంటర్ ఎమ్డీ డాక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామ గృహ సర్వే నిర్వహించడంతో పాటు మొక్కల నాటకం కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.
ఈ కార్యక్రమానికి సంస్కృతి సంస్థల డైరెక్టర్ డా. ఎం. రమకాంత్ రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. జానకి రాములు మార్గదర్శకత్వం వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డా. ఎం. హరి ప్రసాద్, శ్రీ కె. అనిల్ కుమార్, సిబ్బంది డా. డి. ప్రత్యూషతో పాటు ఇతర అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ కమిటీ సభ్యుడు అరవింద్ సహకారం అందించారు.
ఈ సేవలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు.



