*ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, సమగ్ర వైద్య సేవలను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం*
*అందోల్ లో త్వరలో ఫార్మసీ కళాశాల ఏర్పాటు
*జిల్లా స్థాయిలోనే 90 శాతం వైద్య సేవలు అందించే దిశగా ఆధునిక వైద్య సదుపాయాలను అందజేస్తున్నాం
*మహిళల సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం
*మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నాం
*200 కోట్ల రూపాయలతో సింగుర్ లైన్ పనులను ప్రారంభించాం
*రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి.*
*ప్రజావాణి – అందోలు ప్రతినిధి (చాపల సత్యం)*
సంగారెడ్డి జిల్లా అందోలు నియోజకవర్గ స్థాయి ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం అందోల్ – జోగిపేటలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సిసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, సమగ్ర వైద్య సేవలను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంమని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్య సమస్యల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లా స్థాయిలోనే 90 శాతం వైద్య సేవలు అందించే దిశగా ఆధునిక వైద్య సదుపాయాలను విస్తరిస్తున్నామని చెప్పారు.
అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన సేవలందించేందుకు ట్రామా, ఎమర్జెన్సీ సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. గతంలో పావలా వడ్డీ పథకం, అనంతరం వడ్డీ లేని రుణాల పథకాన్ని అమలు చేసినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం మహిళలకు ఇందిరమ్మ క్యాంటీన్లు, సోలార్ యూనిట్లు, పెట్రోల్ బంకులు వంటి వనరులను కేటాయిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు అందిస్తున్నామని వివరించారు. ప్రతి పాఠశాల, కళాశాలలో ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పౌష్టికాహారం, అవసరమైన అన్ని సౌకర్యాలను అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
అందోల్ ప్రాంతంలో త్వరలో ఫార్మసీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. అందోల్ నియోజకవర్గాన్ని విద్యా కేంద్రంగా (ఎడ్యుకేషన్ హబ్గా) అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
అలాగే సింగూర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. 200 కోట్ల రూపాయలతో సింగుర్ లైన్ పనులు మొదలయ్యాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ , మున్సిపల్ చైర్మన్ ఎస్. కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఏ. సత్యనారాయణ (చిట్టిబాబు), స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారిులు, ప్రజలు పాల్గొన్నారు.



