జిల్లాలో ప్రయారిటీ నాన్ ప్రయారిటీ రంగాల్లో నిర్దేశించిన రుణ లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి సూచించారు.మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ కన్సల్టెషన్ కమిటీ (డీసీసీ) మరియు జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (డిఎల్ఆర్సి) సమావేశానికి జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు వ్యవసాయ రుణాలు, ప్రాధాన్యతా రంగ రుణాలు మరింతగా అందించి లక్ష్యాలను సాధించాలని బ్యాంకర్లకు సూచించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సబ్సిడీ ఆధారిత పథకాల రుణాలను ఎటువంటి జాప్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేయాలని ఆదేశించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని బ్యాంకులు మొత్తం రూ.9,450 కోట్ల రుణాలు పంపిణీ చేసి 87.60 శాతం లక్ష్యాన్ని సాధించాయని. ఇందులో ప్రాధాన్యతా రంగానికి రూ.6,746.65 కోట్లు (76.26%), ప్రాధాన్యేతర రంగానికి రూ.2,658.86 కోట్లు (140.68%) రుణాలు అందించగా, స్వయం సహాయక సంఘాలకు ( ఎస్ హెచ్ జి ఎస్ ) రూ.851.86 కోట్లు (96.52%) రుణాలు మంజూరు చేయడం జరిగింది అన్నారు. అదేవిధంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు ముందుండాలని, ముఖ్యంగా ప్రాధాన్యతా రంగంలోని వ్యవసాయ విభాగంలో కనీసం 90 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. ముద్ర, విద్యా రుణాలు, వ్యవసాయం ఎంఎస్ఎంఈ రంగాల్లో గణనీయమైన సేవలు అందించేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించారు.ప్రాధాన్యతా రంగాల లక్ష్య సాధనలో వెనుకబడిన బ్యాంకులు గ్రామీణ ప్రాంతాలన్నింటిలో రుణ మేళాలు నిర్వహించి రైతులకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని తెలిపారు. ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతు వేదికలు, గ్రామసభల్లో పాల్గొని రుణాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే రైతులకు సత్వర సేవలు అందించేందుకు ఐడీఓసీలో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు.త్రైమాసిక ప్రాతిపదికన నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని లక్ష్య సాధన దిశగా పనిచేయాలని సూచించారు. పీఎంఎఫ్ఎంఈ, పీఎంఈజీపీ, ముద్ర యోజన యూనియన్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ( ఆర్ సి టీ ) పథకాలలో నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని సంబంధిత అధికారులకు సూచించారు.స్వయం సహాయక సంఘాల మహిళలకు విలువ ఆధారిత శిక్షణలు అందించాలని, అంతరించిపోతున్న గొల్లభామ చీరల నేసే కళను ప్రోత్సహించేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం వినూత్న వ్యాపార ప్రణాళికలు రూపొందించాలని, టెక్స్టైల్స్ పార్క్తో పాటు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫుడ్ సెక్యూరిటీ మరియు ప్రాధాన్యతా రంగాల్లో కనీసం 97 శాతం లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. జిల్లాలో కరీంనగర్ జిల్లా కన్న ఎక్కువ పంట జిల్లాలో వచ్చిందని ఇందుకు కృషి చేసిన రైతులు, అధికారులు, బ్యాంకర్లను అభినందించారు. రైతులు మరియు స్వయం సహాయక సంఘాలకు అవసరమైన రుణాలు అందించడంతో పాటు, గోదాముల నిర్మాణానికి బ్యాంకులు సహకరించాలని కోరారు. ప్యాక్స్, ఐకేపీ సంస్థలు కూడా గోడౌన్ ల సదుపాయాలు కల్పించుకునేలా రుణ సహాయం అందించాలని సూచించారు.రాబోయే రోజుల్లో ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రైతులకు తగిన సలహాలు, ఆర్థిక సహకారం అందించి పంట దిగుబడులు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.సమావేశం అనంతరం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికను ను కలెక్టర్ ఆవిష్కరించారు.ఎల్డీఎం హరిబాబు మాట్లాడుతూ, 2026-27 సంవత్సరానికి జిల్లాకు మొత్తం రూ.11,829 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలు నిర్ణయించబడ్డాయని. ఇందులో వ్యవసాయ రంగంలో రూ.7,542 కోట్లు సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ( ఎం ఎస్ ఎం ఈ ) : రూ.1,675 కోట్లు, ప్రాధాన్యతా రంగం మొత్తం : రూ.9,675 కోట్లు ప్రాధాన్యేతరరంగం : రూ.2,155 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం హేమలత, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎం మకరంద్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆర్ఎంలు ఈ. రాజయ్య, శ్రీనివాస్, డీసీసీబీ డీజీఎం విశ్వేశ్వర్, నాబార్డ్ డీడీఎం నిఖిల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, వ్యవసాయ, డీఆర్డీఏ అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
జ




