ఘట్కేసర్, మే 6 (ప్రజావాణి): కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ అన్నాజిగూడ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద సిపిఐ నేతలు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్, మండల సహాయ కార్యదర్శి సయ్యద్ ఖదీర్ మాట్లాడుతూ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.3100కు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. డీజిల్, పెట్రోల్ పై లీటరుకు రూ.5 చొప్పున, గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంపు నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఇంధన ధరల పెరుగుదల కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న మరియు పెద్ద ఆహార వ్యాపారాలపై తీవ్ర భారం పడుతోందని తెలిపారు. అలాగే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సాధారణ ప్రజలపై ఆర్థిక భారంగా మారుతున్నాయని విమర్శించారు. ఈ పెంపులను ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సదాశివ, సిపిఐ నాయకులు మురళి, సయ్యద్ సాలార్, ఏఐటీయూసీ నాయకులు బి. పాండు, ఎన్. రాములు, బాల నరసింహ, ఎస్. అంజి, సయ్యద్ జాకీర్, వెంకటేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

