గిరిజన హాస్టల్ విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రజావాణి హన్మకొండ ఆగస్టు 3
హనుమకొండ జిల్లా స్వేరోస్ స్వేరోస్, ఏబీఎస్ఎఫ్ నాయకుల డిమాండ్
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో కలుషిత ఆహారం సేవించడం వల్ల సుమారు 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగించిందని హనుమకొండ జిల్లా స్వేరోస్ స్వేరోస్, ఏబీఎస్ఎఫ్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా స్వేరోస్ జిల్లా మాజీ అధ్యక్షులు శనిగరపు రాజేంద్రప్రసాద్, ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని వారు పేర్కొన్నారు. హాస్టల్లో అందించే ఆహారం నాణ్యత, పరిశుభ్రత, నిల్వ విధానాలపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులకు మెరుగైన వైద్యసేవలు అందించి, వారి ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. అలాగే విద్యార్థినుల తల్లిదండ్రులకు పూర్తి సమాచారం అందిస్తూ, ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనపై జిల్లా స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యానికి బాధ్యులైన వార్డెన్తో పాటు సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, గిరిజన, సంక్షేమ హాస్టళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలు, వైద్య సదుపాయాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
విద్యార్థుల ప్రాణాల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతగా ఉండాలని, ప్రతి హాస్టల్లో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.


