జగిత్యాల జిల్లా ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు.. సుల్తాన్బాద్ సమావేశంలో జేఏసీ రాష్ట్ర కమిటీ నిర్ణయం
పెద్దపల్లి ఆగస్టు 3 ప్రజావాణి :
తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) రాష్ట్ర కార్యదర్శిగా, అలాగే జగిత్యాల జిల్లా ఇన్చార్జిగా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఎస్కే జబ్బార్ నియమితులయ్యారు. పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్లో నిర్వహించిన ఆటో జేఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జేరుపోతుల కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
జేఏసీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో జబ్బార్ క్రియాశీలకంగా పాల్గొంటూ ఆటో కార్మికుల సంక్షేమం కోసం చురుకుగా పనిచేస్తున్నారని నాయకులు కొనియాడారు. ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నట్లు తెలిపారు. బాధ్యతల్లో భాగంగా జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాల కమిటీలతో పాటు జిల్లా కమిటీని త్వరలోనే పూర్తి చేయాలని నియామక ఉత్తర్వుల్లో జబ్బార్ను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు
తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకి, అలాగే తనకు సహకరించిన పెద్దపల్లి జిల్లా కమిటీ నాయకులకు ఎస్కే జబ్బార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జేఏసీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.


