ఘట్కేసర్, జూలై 27 (ప్రజావాణి): భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్ ఘనపూర్ గ్రామంలో సోమవారం ఘనంగా నివాళులర్పించారు. డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామల అమర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, స్థానిక నాయకులతో కలిసి కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా వేముల మహేష్ గౌడ్ మాట్లాడుతూ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దేశాభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత శాస్త్రవేత్త, ఆదర్శ రాష్ట్రపతి అని కొనియాడారు. భారతదేశాన్ని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచ వేదికపై నిలబెట్టడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువత పెద్ద కలలు కనాలని, ఆ కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించాలని కలాం ఇచ్చిన సందేశం నేటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని అన్నారు.
కుల, మత, ప్రాంతాలకు అతీతంగా దేశసేవే ధ్యేయంగా జీవించిన కలాం ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకొని దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆయన చూపిన మార్గంలో నడవడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నానావత్ రూప్సింగ్ నాయక్, వేముల మమత గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాయరు విశ్వనాథం, మాజీ ఉపసర్పంచులు వేముల సత్తయ్య గౌడ్, వేముల పరమేష్ గౌడ్, మాజీ బ్యాంకు డైరెక్టర్ ఉదయ్కుమార్ రెడ్డి, ఘనపూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వేముల రాజు గౌడ్, మాజీ వార్డు సభ్యులు గుర్జకుంట నర్సింహా, మెట్టు రమేష్, వేముల శంకర్ గౌడ్, నానావత్ సురేష్ నాయక్, బర్ల అనిత, మాజీ కో-ఆప్షన్ సభ్యురాలు పైళ్ల లత రెడ్డి, నాయకులు పైళ్ల జంగారెడ్డి, పూస రమేష్ తదితరులు పాల్గొన్నారు.




