ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి TSUTF నిరసన
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్టీఎఫ్ఐ (స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) పిలుపు మేరకు TSUTF జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా TSUTF రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్ మాట్లాడుతూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP-2020)ను రద్దు చేయాలని, పాఠశాలల మూసివేతలను నిలిపివేయాలని, అవసరమైన ప్రాంతాల్లో కొత్త పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యాహక్కు చట్టంలో సవరణలు చేసి ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేశారు.
జిల్లా అధ్యక్షుడు గుండమనేని మహేందర్ రావు, ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు మాట్లాడుతూ సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని కోరారు. అలాగే పీఆర్సీ నివేదికను వెంటనే తీసుకుని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతరం అదనపు కలెక్టర్ నగేష్కు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్, జిల్లా అధ్యక్షుడు గుండమనేని మహేందర్ రావు, ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు, జిల్లా కార్యదర్శులు పాముల స్వామి, గుగులోత్ తిరుపతి జాదవ్, ఎంఎస్టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బెజగం సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి TSUTF నిరసన
RELATED ARTICLES



