వ్యవసాయ భూమిలో బంగారం దొరికినట్లు ప్రచారం!
చెన్నారావుపేట జూన్ 25 ప్రజావాణి
చెన్నారావుపేట మండల పరిధి కోపాకుల చెరువు సమీపంలోని కోపాకులపాడు శివారు వ్యవసాయ భూముల్లో కూలీలకు భారీగా బంగారం దొరికినట్లు స్థానికంగా తీవ్ర ప్రచారం జరుగుతోంది.ఓ కౌలు రైతు కూలీలతో పత్తి చేనులో గడ్డి తీస్తుండగా కూలీలకు సుమారు 50 తులాల బరువు గల బంగారు కంఠహారం, పుస్తెలు, గుండ్లు లభ్యమైనట్లు సమాచారం.కొన్ని దశాబ్దాల క్రితం ఇక్కడ గ్రామం ఉండేదని గతంలోనూ ఈ ప్రాంతంలో దేవుడి విగ్రహాలు బయటపడ్డాయని గ్రామస్థులు చెబుతున్నారు.చుట్టుపక్కల శిథిలావస్థకు చేరిన శివాలయం, హనుమాన్, మైసమ్మ గుడులు ఉండటంతో ఇవి దేవతామూర్తులకు అలంకరించే నగలేనని భావిస్తున్నారు.ఈ ప్రాంతానికి చెందిన ఒక రైతు ట్రాక్టర్తో లోతు దుక్కి దున్నడం వల్లే భూగర్భంలో ఉన్న ఈ ప్రాచీన ఆభరణాలు పైకి వచ్చినట్లు సమాచారం.అయితే ఇంత పెద్ద ఎత్తున నిధి దొరికినట్లు ఊరిలో గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ, పోలీసులకు గానీ, రెవెన్యూ అధికారులకు గానీ ఎలాంటి సమాచారం అందకపోవడం గమనార్హం.



