అమీన్పూర్ అభివృద్ధి పనులపై జోనల్ కమిషనర్కు కాంగ్రెస్ నేతల వినతి
అమీన్పూర్,జూలై4(ప్రజావాణి):అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని కాలనీల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని కోరుతూ అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి జోనల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ సూచన మేరకు రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామిని కలిసి బీరంగూడ, అమీన్పూర్ డివిజన్లలో నెలకొన్న సమస్యలను శశిధర్ రెడ్డి వివరించారు. ప్రజల సమస్యలను సానుకూలంగా స్వీకరించిన మంత్రి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించడంతో, మంత్రి సహకారంతో అదే వినతిపత్రాన్ని జోనల్ కమిషనర్కు సమర్పించారు.
వినతిపత్రంలో నవ్యనగర్, నర్రెగూడెం, వాణినగర్, సుల్తాన్పూర్, కిష్టారెడ్డిపేట, నారాయణరెడ్డి కాలనీ, సాయి కాలనీ, జయలక్ష్మీనగర్ తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన మొత్తం 22 అభివృద్ధి పనులను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. మంత్రి డా. వివేక్ వెంకటస్వామి సహకారంతో అభివృద్ధి పనులు వేగవంతం అయ్యేలా అధికారులతో సమన్వయం కొనసాగిస్తున్నామని చెప్పారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన జోనల్ కమిషనర్ సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో అంచనాలు సిద్ధం చేయించి, ప్రాధాన్యత ఆధారంగా అభివృద్ధి పనులు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీరంగూడ దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, మన్నే రవీందర్, రమేష్ యాదవ్, ఈశ్వర్ రెడ్డి, మహేష్ గౌడ్, సురేష్ నాయక్, కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.




