బెజ్జంకి, జూలై 1 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బెజ్జంకి క్రాస్ రోడ్ బస్ స్టేజ్ సమీపంలో బుధవారం ఉదయం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న పికప్ వాహనాన్ని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 1న ఉదయం సుమారు 7:30 గంటలకు బెజ్జంకి క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో గాగిల్లాపూర్ వైపు నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ పికప్ వాహనం (టిజీ-36-టి-2367)ను అనుమానాస్పదంగా గుర్తించి తనిఖీ చేశారు. తనిఖీలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
విచారణలో వాహన డ్రైవర్, యజమాని గీకురు అజయ్ (32), కోహెడ మండలం వింజపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా తేలింది. ప్రాథమిక విచారణలో గాగిల్లాపూర్ గ్రామ పరిధిలోని మొయతుమ్మెద వాగు నుంచి అక్రమంగా ఇసుక తవ్వి అదే వాహనంలో తరలిస్తున్నట్లు వెల్లడైంది.దీంతో ఇసుకతో కూడిన పికప్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, నిందితుడిపై బెజ్జంకి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు.




