కమిషనర్ ఆఫ్ పోలీస్, సిద్ధిపేట
ఎస్. రష్మీ పెరుమాళ్, ఐపీఎస్
సిద్దిపేట, మార్చి 25, ప్రజావాణి
జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ గారు స్పష్టం చేశారు. జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో సరఫరా ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రజలు అనవసర ఆందోళనకు గురై ఒకేసారి బంకులకు చేరుకోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు సాధారణ పంపిణీకి అంతరాయం కలుగుతుందని సిపి గారు తెలిపారు.సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి వాహనదారులు తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ నింపుకోవడానికి లేదా అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవడానికి ప్రయత్నించవద్దని సిపి గారు సూచించారు. ఇలా చేయడం వల్ల ఇతరులకు అనవసరమైన అసౌకర్యం కలుగుతుందని, సాధారణ అవసరాల మేరకే ఇంధనాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిర్ధారించని సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయడం ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టించవద్దని సూచించడం జరిగింది.జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉందని తెలిపారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే, వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.




