మృతుని కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత
గోవిందరావుపేట (ప్రజావాణి)
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం బుస్సాపూర్ గ్రామం లో స్వయం సహాయక సంఘాల మహిళలు మానవత్వాన్ని చాటుకున్నారు. సమ్మక్క సారక్క గ్రామైక్య సంఘం పరిధిలోని 22 సంఘాలకు చెందిన మహిళా సభ్యులు సమావేశమై ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు.
గ్రామంలో ఏ సంఘ సభ్యురాలి కుటుంబంలో నైనా ఎవరైనా మరణిస్తే
ఆ కుటుంబానికి అండగా నిలవాలని, వారికి 22 సంఘాల తరపున 50 కేజీల బియ్యాన్ని అందించి ఆదుకోవాలని ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు.
ఆ తీర్మానానికి అనుగుణంగా తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.ఇటీవల గ్రామానికి చెందిన పాలెం రవి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మరణించారు. దీంతో సంఘాల మహిళలు వెంటనే స్పందించారు. మంగళవారం సీసీ, ఏపీఎం మరియు 22 సంఘాల సభ్యుల సమక్షంలో మృతుడు పాలెం రవి భార్య చంద్రకళకు 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా మహిళా సంఘాల నాయకురాలు మాట్లాడుతూ గ్రామంలో మేమంతా ఒకే కుటుంబంలా ఉంటామని, ఎవరి ఇంట్లో కష్టం వచ్చినా మేమే ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఏ సభ్యురాలి ఇంట్లో విషాదం జరిగినా ఇదే విధంగా 50 కేజీల బియ్యాన్ని అందించి ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. సంఘాల మహిళల ఈ నిర్ణయంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు, అందరూ అభినందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో సీసీ, ఏపీఎం తో పాటు 22 సంఘాలకు చెందిన మహిళా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

