అధికారుల డుమ్మాతో సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం

పలు శాఖల అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల గైర్హాజరు
*చిలుకూరు, సెప్టెంబర్ 09 ( ప్రజావాణి)*: ప్రజా సమస్యల పరిష్కారం, మండల అభివృద్ధిపై చర్చించాల్సిన మండల సర్వసభ్య సమావేశం పలువురు అధికారులు, ప్రజాప్రతినిధుల గైర్హాజరుతో సాదాసీదాగా సాగింది. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో నరసింహారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.మండల ప్రత్యేక అధికారి, ఎన్ఎస్పీ డీఈ జె.సత్యనారాయణ మాట్లాడుతూ సాగర్ ఎడమ కాలువ నీటిని చెరువుల్లోకి మళ్లించి తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సర్పంచులు ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.అయితే కీలకమైన సర్వసభ్య సమావేశానికి పలు మండల శాఖల అధికారులు, కొన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించాల్సిన సమావేశానికి అధికారులు, ప్రజాప్రతినిధులు గైర్హాజరు కావడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

