నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
పంట చేతికి రాదనే దిగులు, పెట్టిన పెట్టుబడి దక్కదనే వేదన ఓ రైతును బలిగొంది. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామానికి చెందిన పనస రాములు (55) సోమవారం ఉదయం తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. అక్కడ తాను సాగు చేసిన పత్తి చేను వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయి ఉండటం చూసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆర్ధిక నష్టం తట్టుకోలేక, ఆవేదనతో చేను వద్దే పురుగుల మందు తాగి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. కాగా, సోమవారం సాయంత్రం వరకు రాములు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చేను వద్దకు వెళ్లి చూశారు. అప్పటికే ఆయన మృతి చెంది పడి ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఒకేసారి ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోవడంతో అంగడిపేట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

