నంగునూరు, ప్రజావాణి,సెప్టెంబర్ 7:
జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ ఉద్యోగులు కోలాటాలతో నిరసన తెలిపారు. రాష్ట్ర స్థాయి పాలిటెక్నిక్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు సోమవారం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 22వ రోజు భోజన విరామ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు కోలాటాలు ఆడుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు.తెలంగాణ పాలిటెక్నిక్ ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కమిటీ సహ అధ్యక్షుడు బూరం అభినవ్ మాట్లాడుతూ ప్రభుత్వం జీవో 97ను రద్దు చేసే వరకు శాంతియుతంగా భోజన విరామ నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు.పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల నాణ్యమైన పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ విద్యకు నష్టం కలిగే ప్రమాదం ఉందని అన్నారు. ముఖ్యంగా పేద విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆర్థిక భారంతో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రభుత్వం రోజుకో రకమైన ప్రకటన చేయడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొంటున్నాయని తెలిపారు. జీవో 97ను వెంటనే రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యను యథాతథంగా కొనసాగించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షహేబాజ్, పాతూరి శ్రీనివాసరెడ్డి, రాజు, రామకృష్ణ, రాజమౌళి, విజయ్కుమార్, కవిత, జ్యోతి, వైదేహి, రాజేష్, కమల్ అహ్మద్, సంతోష్, నవీన్, మంజుల, వాణి, భాగ్యలక్ష్మి, బాలమణి, అనిత, లావణ్య, రవి, లింగం, శ్రీనివాస్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

