- ఫీజు రీయింబర్స్మెంట్ నిలిపివేత: పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం!
రూ.14,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి:బీసీ, ఎస్సి,ఎస్టి,జేఏసీ, డిమాండ్
చెన్నారావుపేటలో డిప్యూటీ తాసిల్దార్ కు వినతిపత్రం అందజేత
చెన్నారావుపేట సెప్టెంబర్ 02 ప్రజావాణి
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా తీవ్ర అలసత్వం వహిస్తోందని, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న రూ.14,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని బిసి, ఎస్సీ, ఎస్టీ,జేఏసి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్త నిరసన పిలుపులో భాగంగా వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల జేఏసి ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ తాసిల్దార్ కి వినతిపత్రం అందజేశారు.బకాయిలు అందకపోవడంతో రాష్ట్రంలోని 30 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చదువులు త్రిశంకు స్వర్గంలో పడ్డాయని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.కోర్సులు పూర్తయినా కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. ఫలితంగా ఉన్నత చదువులకు, ఉద్యోగ అవకాశాలకు దరఖాస్తు చేసుకోలేక విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఫీజులు చెల్లించలేక, కాలేజీల ఒత్తిడి తట్టుకోలేక గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారని, తీవ్ర నిరాశతో కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎలాంటి షరతులు లేకుండా కాలేజీల నుండి విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇప్పించేలా ప్రభుత్వం తక్షణమే జీవో విడుదల చేయాలని, బకాయి నిధులను విడుదల చేయాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అలువాల శ్రీనివాస్, జేఏసి ముఖ్య నాయకులు మర్రి రమేష్, పసునూరి సామేలు, మంతెన బాబు, రుపిక నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.

