ఘట్కేసర్, ఆగస్టు 28 (ప్రజా వాణి): పేద దివ్యాంగుల ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన ప్రభుత్వ భూమి కబ్జాకు గురై ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా కబ్జాదారులపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.
పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ మహేంద్రహిల్స్–పీహెచ్సీ కాలనీ ప్రాంతంలోని సర్వే నంబర్ 14లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో పేద, దివ్యాంగుల ఇళ్ల నిర్మాణం కోసం 5 ఎకరాల 21 గుంటల ప్రభుత్వ భూమిని కేటాయించినట్లు తెలిపారు. ఇందులో 3 ఎకరాల 21 గుంటల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన 2 ఎకరాల భూమిలో ఇళ్లు నిర్మించాల్సి ఉందన్నారు.
సుమారు రూ.20 కోట్లకు పైగా విలువైన ఈ భూమిని కొందరు ఆక్రమించి, సర్వే నంబర్ 14ను 15, 16గా మార్చి అక్రమంగా విక్రయించినట్లు వీహెచ్ ఆరోపించారు. ఈ విషయంపై 2021లోనే జీహెచ్ఎంసీ గృహ నిర్మాణ విభాగం లేఖలతో సహా పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు చర్యలు లేకపోవడం బాధాకరమన్నారు.
భూమి సర్వేకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వెళ్లినప్పుడు కబ్జాదారులు అడ్డుకుంటున్నారని, అయినా అధికారులు మౌనం వహించడం సరికాదన్నారు. పేద దివ్యాంగులకు దక్కాల్సిన భూమిని ఆక్రమించిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే సమగ్ర సర్వే నిర్వహించి, కబ్జాకు గురైన రెండు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని అర్హులైన దివ్యాంగులకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని వి. హనుమంతరావు కోరారు.

