బెజ్జంకి, ఆగస్టు 19 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కళ్లేపల్లి గ్రామ సమస్యల పరిష్కారం కోసం సర్పంచ్ బిగుల్లా మోహన్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కళ్లేపల్లి–బెజ్జంకి బీటీ రోడ్డు గుంతలమయంగా మారి వాహనదారులు, పాఠశాల బస్సులకు ప్రమాదకరంగా మారిందని, వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరారు. అలాగే కళ్లేపల్లి–గుంటూరుపల్లె బీటీ రోడ్డును కూడా బాగు చేయాలని, అలాగే గ్రామంలోని మూడు అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నందున నూతన సొంత భవనాలు నిర్మించాలని, పాఠశాలకు నూతన భవనం మంజూరు చేయాలని కోరారు. కుంగిపోయిన తాగునీటి బావికి మరమ్మతులు చేపట్టేందుకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.అలాగే కళ్లేపల్లి, ఇట్టిరెడ్డిపల్లె, గుంటూరుపల్లె ప్రాంతాలకు మరో ఆశా కార్యకర్తను నియమించాలని, ఎస్టీ కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామంలో సీసీ రోడ్లతో పాటు ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ బిగుల్లా మోహన్ ఎమ్మెల్యేను కోరారు.

