ఎన్నికల వేళ ఓట్ల కోసం ఇంటింటికీ.. ప్రమాదం జరిగితే పరామర్శకూ రారు!
ఎల్లంపేట: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చే ప్రజాప్రతినిధులు, నాయకులు.. గెలిచిన తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని తలారి బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇంటి పెచ్చు ఊడిపడి తండ్రి తలారి యాదగిరి, ఆయన 13 ఏళ్ల కుమార్తె వైష్ణవికి స్వల్ప గాయాలైన ఘటనలోనూ అధికార పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు కనీసం పరామర్శించేందుకు రాలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
ప్రమాదం జరిగిన విషయం తెలిసినా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో “మేమున్నాం.. మీకు అండగా ఉంటాం” అంటూ ఇంటింటికీ వచ్చే నాయకులు, గెలిచిన తర్వాత తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
“ఎన్నికల సమయంలో మేమున్నామని చెప్పి ఓట్లు అడుగుతారు.. గెలిచిన తర్వాత ప్రాణాపాయం జరిగినా కనీసం పరామర్శించడానికి కూడా రావడం లేదు” అంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
శిథిలావస్థలో ఉన్న తమ ఇంటిని పరిశీలించి, ప్రభుత్వం నుంచి తక్షణ సాయం అందించడంతో పాటు పక్కా గృహం నిర్మించి ఇవ్వాలని వారు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాతైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

