ఘట్కేసర్, ఆగస్టు 10 (ప్రజావాణి): ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నిరంతరం ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహిస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కల్లూరి జయచంద్ర అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం ఎంఎంసీ పోచారం డివిజన్ అన్నోజిగూడలో సోమవారం గడపగడపకు కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
సీపీఐ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్, సహాయ కార్యదర్శి సయ్యద్ ఖదీర్, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కల్లూరి జయచంద్ర ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జయచంద్ర మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు సీపీఐ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహా ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సీపీఐని బలహీనపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కమ్యూనిజాన్ని అంతం చేయడం సాధ్యం కాదన్నారు. మతమౌఢ్యం, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వాలపై ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్య దేశంలో మతరాజ్య స్థాపనకు ప్రయత్నాలు జరిగితే ప్రజల తిరుగుబాటు ఉద్యమంలో కమ్యూనిస్టులు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తారని జయచంద్ర స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బి.చౌదరి, సత్యనారాయణ, సయ్యద్ అలీ, ఎం.రామచంద్ర, శంకరయ్య, రామ్కుమార్, పాషా, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


