*బయ్యారంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం*
*జాతీయ జెండాను ఆవిష్కరించిన తహసీల్దార్ నాగరాజు*
*ప్రజలకు పారదర్శకమైన సేవలే ప్రజా పాలన లక్ష్యం : తహసీల్దార్*
*ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం*
ప్రజావాణి బయ్యారం, సెప్టెంబర్ 17:
బయ్యారం మండల కేంద్రంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తహసీల్దార్ చప్పిడి నాగరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జెండాకు వందనం సమర్పించి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే ప్రజా పాలన ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు తమ శాఖ తరఫున కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన ప్రజలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, ఆర్ఐలు, సర్వేయర్, కార్యాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

