గీత కార్మికుల పొట్టకొడుతున్న ‘కాట్రపల్లి’ ఘటన!
తాడి, ఈత చెట్లను విచక్షణారహితంగా నరికేస్తున్న దుండగులు.
ఆలకుంట్ల సారయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం డిమాండ్.
కేసముద్రం ఆగష్టు 7,ప్రజావాణి.
తెలంగాణ సాంస్కృతిక ప్రతీకలైన తాడి, ఈత చెట్లపై గొడ్డలి వేటు పడుతోంది. పచ్చని ప్రకృతికి, ఒక కులవృత్తి జీవనాధారానికి రక్షణ కల్పించాల్సిన చోట.. కొందరు స్వార్థపరులు విచక్షణారహితంగా చెట్లను నరికివేస్తూ గీత కార్మికుల పొట్టకొడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కులవృత్తినే నమ్ముకుని బతుకుతున్న గౌడ అన్నల ఉపాధిని దెబ్బతీస్తూ, పర్యావరణాన్ని నాశనం చేస్తున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం శ్రేణులు, ప్రజాస్వామ్యవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
*జీవనాధారంపై దెబ్బ.. లబోదిబోమంటున్న కుటుంబాలు.*
తాడి, ఈత చెట్లు కేవలం ప్రకృతి సంపద మాత్రమే కాదు.. శతాబ్దాలుగా గౌడ సమాజానికి జీవనాధారం. తెల్లవారితే ప్రాణాలను పణంగా పెట్టి, మోకు దెబ్బను నమ్ముకుని బతికే గీత కార్మికుల ఉపాధిని ఈ చెట్లే నిలబెడుతున్నాయి. కాట్రపల్లి గ్రామంలో ఆలకుంట్ల సారయ్య అనే వ్యక్తి అక్రమంగా, విచక్షణారహితంగా ఈ చెట్లను నరికివేస్తున్నట్లు సమాచారం. ఈ చర్యతో అనేక గౌడ కుటుంబాలు వీధిన పడే పరిస్థితి దాపురించింది. చెట్టు బతికితేనే గౌడ కుటుంబం బతుకుతుంది.. చెట్టే లేకపోతే మా పిల్లలను ఎలా పోషించుకోవాలి?అని స్థానిక గీత కార్మికులు కన్నీరుమున్నీరవుతున్నారు.ఈ అక్రమ నరికివేతపై గౌడ సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఒక కులానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదని, తెలంగాణ సంస్కృతిని, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సంఘం నేతలు స్పష్టం చేశారు. గ్రామ ప్రజలు, యువత, ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా స్పందించి ఈ అక్రమ నరికివేతను అడ్డుకోవాలని, ప్రకృతిని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
అధికారులు,కఠిన చర్యలు తీసుకోండి!
అక్రమంగా చెట్లను నరుకుతూ, ఒక సామాజిక వర్గం ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్న ఆలకుంట్ల సారయ్యపై సంబంధిత రెవెన్యూ, అటవీ, పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని పత్రికా ముఖంగా డిమాండ్ చేస్తున్నాం. అక్రమార్కులను ఉపేక్షిస్తే భవిష్యత్తులో గీత వృత్తి అంతరించిపోయే ప్రమాదం ఉంది. తక్షణమే నిందితుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, గౌడ అన్నలకు న్యాయం చేయాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వం మరియు అధికారులపై ఉంది.





