*కోల్ మైన్స్ పెన్షన్ దారులకు బీమా సౌకర్యం కల్పించాలి*
*యూనియన్ బ్యాంక్ ఎదుట సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ధర్నా*
*మన ప్రజావాణి*
జూలై 27
సింగరేణిలో విధులు నిర్వహించి, పదవి విరమణ పొంది, యూనియన్ బ్యాంకులో ఖాతాలు కలిగి ఉన్న కోల్ మైన్స్ పెన్షన్ దారులకు 70 సంవత్సరాల లోపు వారికి 30 లక్షల రూపాయల ప్రమాద బీమా, సహజ మరణానికి 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాలోని తాండూరు ఐబి లో ఉన్న యూనియన్ బ్యాంక్ కార్యాలయం ఎదుట సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి, ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ నిశంత్ కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, యూనియన్ బ్యాంక్ యజమాన్యం మధ్య 26 ఫిబ్రవరి, 2024న చేసుకున్న ఒప్పందం మేరకు 70 సంవత్సరాల లోపు ఉన్నవారికి, యూనియన్ బ్యాంకులో ఖాతాలు కలిగిన వారికి 30 లక్షల రూపాయల ప్రమాద బీమా, 10 లక్షల రూపాయల సహజ మరణ బీమా సౌకర్యం కల్పించాల్సి ఉందన్నారు. అయితే గత రెండు సంవత్సరాల కాలం నుండి యూనియన్ బ్యాంక్ యజమాన్యం నిర్లక్ష్య వైఖరి వహిస్తూ, సింగరేణి విశ్రాంత బొగ్గు పెన్షన్ దారులకు ఈ ప్రమాద బీమా సౌకర్యం కల్పించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రాబోయే వారం 10 రోజుల లోపల ఖాతాలు కలిగి ఉన్న విశ్రాంత బొగ్గు పెన్షన్ దారులకు 30 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా యూనియన్ బ్యాంక్ కార్యాలయాల ముందు సింగరేణి విశ్రాంత కార్మికుల కుటుంబాలతో సహా పెద్ద ఎత్తున శాంతియుత ఆందోళన, ధర్నా నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు అసం రాజయ్య, తగరం రాజన్న, తోటపల్లి ఎల్లయ్య, దేవరకొండ మౌగిలి, కే దుర్గా స్వామి, కే లక్ష్మీ, ఎర్రయ్య, సి రాయలింగు, ఎడ్ల గొంతయ్య, సింగరేణి విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.
కోల్ మైన్స్ పెన్షన్ దారులకు బీమా సౌకర్యం కల్పించాలి
RELATED ARTICLES



