ఘట్కేసర్, జూలై 15: రెటినోవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘట్కేసర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి మేడం ఆదేశాల మేరకు, డీసీపీ వి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ఏసీపీ సంపత్ కుమార్ పర్యవేక్షణలో ఈ ఆరోగ్య శిబిరం జరిగింది.
ఈ శిబిరంలో ప్లానెట్ ఆప్టిక్స్ వైద్య బృందం కంటి పరీక్షలు నిర్వహించగా, శ్రీకార హాస్పిటల్ వైద్యులు సాధారణ ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు (బీపీ), రక్తంలో చక్కెర స్థాయిలు (జీఆర్బీఎస్), ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. అలాగే క్లోవ్ డెంటల్ వైద్య నిపుణులు దంత పరీక్షలు చేసి అవసరమైన వైద్య సూచనలు అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఏసీపీ సంపత్ కుమార్ పోలీసు సిబ్బంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని, విధి నిర్వహణలో నిత్యం ఒత్తిడికి గురయ్యే సిబ్బంది తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఇలాంటి వైద్య శిబిరాలు పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ శిబిరాన్ని నిర్వహించిన రెటినోవా ఫౌండేషన్, వైద్య సంస్థల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ ట్రాఫిక్ స్టేషన్ ఎస్హెచ్వో వై. రవీందర్, ఆర్ఐ సీనయ్య, ఎస్ఐ మల్లయ్య, ఎస్ఐ ప్రసాద్, ఏఎస్ఐ తిరుపతి రెడ్డితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వైద్య శిబిరంలో పలువురు సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనలు పొందారు.





