•పటాన్చెరు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు, జూలై 9 (ప్రజావాణి): పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకునేందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ పర్యటనలో ఎండీఆర్ ఫౌండేషన్ కో-పౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని తిమ్మక్క చెరువు సుందరీకరణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. హెచ్ఎండిఏ–సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ.4.45 కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాకింగ్ ట్రాక్, బతుకమ్మ ఘాట్, ఓపెన్ జిమ్, హరితవనం తదితర పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిమ్మక్క చెరువును ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా పటాన్చెరుకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
అనంతరం పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ను సందర్శించిన ఎమ్మెల్యే అక్కడి పరిస్థితులను పరిశీలించి, రైతులు మరియు వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవసరమైన పనులను త్వరితగతిన పూర్తి చేసి మార్కెట్ యార్డును మరింత అభివృద్ధి చేయాలని సూచించారు.




