హరితాహారం ర్యాలీతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన
రామచంద్రపురం ,జులై 8 (ప్రజావాణి) :హరితాహారం కార్యక్రమంలో భాగంగా చందానగర్లోని ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, చెట్ల పెంపకం, పచ్చదనం విస్తరణ లక్ష్యంగా నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు హరితాహారం ప్రాధాన్యతను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. చెట్లు ఆక్సిజన్ను అందించడంతో పాటు గాలి కాలుష్యాన్ని తగ్గించి, వాతావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత కారణంగా ఏర్పడుతున్న వాతావరణ మార్పులను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
“ఒక్కో మనిషి – ఒక్కో మొక్క” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ హరితాహారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ మాలిని, ఆర్ఐ ఆరోగ్యరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




