•కొత్త పింఛన్లకు మోక్షం ఎప్పుడు? – రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మెట్టు శ్రీధర్
పటాన్చెరువు, జూలై 1(ప్రజావాణి): తెలంగాణ రాష్ట్రంలో కొత్త సామాజిక భద్రతా పింఛన్ల మంజూరులో జరుగుతున్న జాప్యంపై నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షులు, తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 30 నెలలు పూర్తవుతున్నప్పటికీ, కొత్తగా అర్హత పొందిన వేలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర నిరుపేదలకు ఇప్పటికీ పింఛన్లు మంజూరు కాలేదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పింఛన్ల పెంపు, కొత్త లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు.
ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించడంతో పాటు రాష్ట్ర బడ్జెట్లో 2 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. అలాగే మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ, జూలై నెల ప్రారంభమైనా అమలు కనిపించడం లేదని అన్నారు.
మండల, మున్సిపల్ కార్యాలయాల్లో వేలాది దరఖాస్తులు పెండింగ్లో ఉండటంతో అర్హులైన లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ వెంటనే కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు పింఛన్ పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, కనీసం కొత్తగా అర్హత పొందిన వారికి ఆలస్యం లేకుండా పింఛన్లు మంజూరు చేయడం అత్యవసరమని మెట్టు శ్రీధర్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి నిరుపేదకు సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, ఈ అంశంపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.


