బెజ్జంకి,జూన్ 27 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో నెలకొన్న సిబ్బంది కొరతను వెంటనే భర్తీ చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన PHCను సందర్శించి వైద్యాధికారితో ఆసుపత్రి సమస్యలపై చర్చించి, చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి,24 గంటల వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రిలో ఒక్క స్టాఫ్ నర్స్ కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు. ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఒక సూపర్వైజర్, ఆరుగురు ఏఎన్ఎంలు అవసరమున్నప్పటికీ ప్రస్తుతం తీవ్ర సిబ్బంది కొరత ఉందని తెలిపారు. ఆయుష్ విభాగ సిబ్బందిని కూడా డిప్యూటేషన్పై పంపడంతో వైద్య సేవలు మరింత దెబ్బతిన్నాయని,అలాగేబెజ్జంకి మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని, మండలంలోని రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రెండు 108 అంబులెన్సులను కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సంఘ ఎల్లయ్య, బొమ్మిడి సాయికృష్ణ, భోనగిరి లింగం తదితరులు పాల్గొన్నారు.



