ఓటరు హక్కు పరిరక్షణే లక్ష్యం – ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమ అవగాహన సదస్సులో మాద్రి పృథ్వీరాజ్
పటాన్చెరు, జూన్ 22 (ప్రజావాణి): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించే ఉద్దేశంతో పటాన్చెరులోని పీవీ నరసింహారావు ఆడిటోరియంలో ఎన్నికల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వపక్ష సమావేశం, అవగాహన సదస్సులో ఎండీఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ప్రతినిధులకు ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అమలు విధానం, ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, సవరణలు, కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలపై ఎన్నికల అధికారులు సమగ్రంగా వివరించారు.
మాద్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ ప్రతి అర్హత కలిగిన పౌరుడు తన ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన బాధ్యత అని పేర్కొన్నారు. జూన్ 25 నుంచి జూలై 25 వరకు జరిగే ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రజలందరూ చురుకుగా పాల్గొని తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవాలని కోరారు. ఏవైనా సమస్యలు లేదా సవరణలు అవసరమైతే సంబంధిత అధికారులను లేదా బూత్ స్థాయి ప్రతినిధులను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్, వంగరి అశోక్, పటాన్చెరు తహశీల్దార్ హరిబాబు, డిప్యూటీ తహశీల్దార్ షఫీ, బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.




