ఉపాధి హామీలో ‘వినోదం’. ఫీల్డ్ అసిస్టెంట్, ఏపీవోల వాటాల పర్వం: చర్యలు తీసుకోని పై అధికారులు!
కలసపాడు/రంగసముద్రం:
రంగసముద్రం పంచాయతీలో ఉపాధి హామీ పథకం అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డం పెట్టుకుని, వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా తప్పుడు ఫేస్ అటెండెన్స్ వేస్తూ నిధులు దారి మళ్లిస్తున్న వ్యవహారంలో ప్రధాన సూత్రధారుల పాత్రపై ఇప్పుడు మండల వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.
మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వాటాల పంపకాలు?
టెక్నికల్ అసిస్టెంట్ (TA) వినోద్, ఫీల్డ్ అసిస్టెంట్, మరియు మండల స్థాయి అధికారి అయిన ఏపీవో (APO) ల చుట్టూనే ఈ అవినీతి చక్రం తిరుగుతోందని ప్రజలు ఘనంగా చర్చించుకుంటున్నారు.
* క్షేత్రస్థాయిలో తప్పుడు మస్టర్లు వేయడం ద్వారా వస్తున్న సొమ్ములో ఎవరి వాటా ఎంత? ఎవరికి ఎంత శాతం కమిషన్ వెళుతోంది? అనే విషయాలపై గ్రామాల్లో బహిరంగంగానే గుసగుసలు వినిపిస్తున్నాయి.
* గతంలో కలసపాడు మండలంలోని తంబళ్లపల్లె, లింగారెడ్డిపల్లెల్లో అవినీతి మార్కు చూపించిన టెక్నికల్ అసిస్టెంట్ వినోద్.. ఇప్పుడు రంగసముద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ను ముందు పెట్టి, ఏపీవో ఆశీస్సులతో ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.
పై అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు?
ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా, ప్రజల్లో ఇంతగా వినపడుతున్నా.. పై అధికారులు వీరిపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
* క్షేత్రస్థాయి పరిశీలన (Physical Verification) చేయాల్సిన ఉన్నతాధికారులు కార్యాలయాలకే పరిమితం కావడం వల్లే ఈ అక్రమార్కులకు బలం చేకూరుతోంది.
* అవినీతి సొమ్ములో పై అధికారులకు కూడా క్రమం తప్పకుండా నజరానాలు అందుతున్నాయా? అందుకే వీరు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
* గతంలో వినోద్పై వచ్చిన ఆరోపణలప్పుడే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుని ఉంటే, ఈరోజు రంగసముద్రంలో ఇంత ధైర్యంగా ఉపాధి నిధులను దోచుకునేవారు కాదని స్థానికులు మండిపడుతున్నారు.
ఉన్నతాధికారుల స్పందన కరువైంది
కూలీల పొట్టగొట్టి, ప్రభుత్వ సొమ్మును పంచుకుంటున్న ఈ ముగ్గురు (TA వినోద్, ఫీల్డ్ అసిస్టెంట్, APO) లీడర్ల అవినీతిపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, రంగసముద్రం పంచాయతీలో విచారణ జరిపి తప్పుడు అటెండెన్స్ రికార్డులను బయటకు తీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.రేపటి సంచికలో పూర్తి వివరాలతో ప్రజల ముందుకు మీ ప్రజావాణి




