అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి.
హుజూర్నగర్, ప్రజావాణి జూన్ 20: హుజూర్నగర్ మండలంలోని బూరుగడ్డ గ్రామంలో నిర్వహించిన కార్యసిద్ధి అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ మరియు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్ర స్వామి దివ్య ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించారు. ఈ సందర్భంగా శ్రీలతారెడ్డి మాట్లాడుతూ అన్నదానం మహాదానమని, సమాజ సేవలో ఇది అత్యంత గొప్ప పుణ్యకార్యమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సత్సంకల్పాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
ఈ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులకు ఆమె అభినందనలు తెలియజేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు ఉమా మహేశ్వరరావు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కోటిరెడ్డి, బీజేపీ నాయకులు మాడ్గుల లక్ష్మీనారాయణ, కనకయ్య, నాగరాజు, రాములు, చారి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




