*ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా పర్యావరణ పరిరక్షణ అవగాహన*
*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*
స్థానిక డాన్ బాస్కో జూనియర్ కళాశాలలో “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ అంశంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చండూర్ ఫారెస్ట్ సబ్ రేంజ్ ఆఫీసర్ సుమన్, మునుగోడు ఫారెస్ట్ సబ్ రేంజ్ ఆఫీసర్ సుచరిత విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించి, క్విజ్ పోటీలు నిర్వహించారు. పోటీలలో ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన గ్రూపులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఫా. అనూప్ మాట్లాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి పౌరుని తక్షణ కర్తవ్యం అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, ప్రకృతిని కాపాడేందుకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ హిత జీవన విధానాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.




