ప్రజావాణి న్యూస్ (మే13) గుంటూరు నగర పాలక సంస్థలో పారిశుధ్య విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ కె. మయూర్ అశోక్ హెచ్చరించారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజారోగ్య విభాగం సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పారిశుధ్య మెరుగుదలపై ఇప్పటికే పలు మార్లు సూచనలు చేసినప్పటికీ కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ప్రజారోగ్య అధికారి, శానిటరీ ఇన్స్పెక్టర్ తమ పరిధిని స్వచ్ఛ ప్రాంతంగా తీర్చిదిద్దేలా పిన్ పాయింట్ పద్ధతిలో పనులు నిర్వహించాలని సూచించారు.గుంటూరు నగరపాలక సంస్థ ఇప్పటికే స్వచ్చ సర్వేక్షణ్లో సూపర్ లీగ్ సిటీ స్థానాన్ని సంపాదించుకుందని, ఆ గుర్తింపును నిలబెట్టుకునేందుకు ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేయాలని కోరారు. ప్రతి వార్డులో ఉన్న ఆర్ఆర్ఆర్ సెంటర్లు, క్లస్టర్ కంపోస్ట్ బిన్లను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు.భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేయకుండా పర్యవేక్షణ పెంచాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై అపరాధ రుసుములు విధించాలని తెలిపారు. అదేవిధంగా డ్రైన్లలో పేరుకుపోయిన సిల్ట్ను వెంటనే తొలగించి, నగర పరిశుభ్రతను కాపాడాలని సూచించారు.నగరంలో గోడలపై పోస్టర్లు అతికించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, పోస్టర్లు గుర్తించిన వెంటనే తొలగించి సంబంధిత వ్యక్తులపై జరిమానాలు విధించాలని శానిటరీ ఇన్స్పెక్టర్లను కమిషనర్ ఆదేశించారు.ఈ సమావేశంలో ఇన్చార్జ్ అదనపు కమిషనర్ జి. సాంబశివరావు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, డిప్యూటీ కమిషనర్లు బి. శ్రీనివాసరావు, సి.హెచ్. శ్రీనివాస్, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, విఎయస్ డాక్టర్ నాగేశ్వరావు, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు
పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం సహించం అధికారులకు కమిషనర్ కె. మయూర్ అశోక్ హెచ్చరిక
RELATED ARTICLES




