ఘట్కేసర్, మే 1 (ప్రజావాణి): మేడ్చల్ నియోజకవర్గంలోని పోచారం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తుల నడుమ ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే టీపీసీసీ నాయకుడు వజ్రేష్ యాదవ్, బీఆర్ఎస్ యువ నాయకుడు సామల సందీప్ రెడ్డి పాల్గొన్నారు.
ఆలయ ఈవో భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కళ్యాణ మహోత్సవం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి మహిమను చాటుతూ భక్తుల హృదయాలను కట్టిపడేసింది. వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారి దివ్య కళ్యాణాన్ని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.
ఈ వేడుకల్లో ఆలయ కమిటీ చైర్మన్ చింతపంటి సత్తయ్య యాదవ్, ధర్మకర్తలు ఉదారి వెంకటేష్ ముదిరాజ్, మెడగొని ఆంజనేయులు ముదిరాజ్, బండారి సుధాకర్, కంతి లావణ్య, మాజీ సర్పంచ్ దేశం బాలరాజ్ గౌడ్, ఓరుగంటి వెంకటేశ్వర్లు గౌడ్, ఉదారి వేణుగోపాల్ ముదిరాజ్, మాజీ చైర్మన్ నీరుడి అశోక్, బిఆర్ఎస్ పార్టీ వెంకటపురం ప్రెసిడెంట్ నవీన్, మాజీ ఎంపీటీసీ నీరుడి రామారావు, కో-ఆపరేటివ్ బ్యాంక్ సభ్యుడు రేసు లక్ష్మారెడ్డి, బుర్ర కల్పన వెంకటేష్, ఆకిడి బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల నుండి భారీగా తరలివచ్చిన భక్తజనంతో బ్రహ్మోత్సవాలు జనసంద్రంలా మారి అత్యంత వైభవంగా కొనసాగింది.





