దేవేందర్ నగర్ దాడి 13 మంది అరెస్ట్…
మిగతా నిందితుల కోసం పోలీసుల గాలింపు
బోడుప్పల్ దేవేందర్ నగర్లో హాకీ స్టిక్స్,కర్రలతో బీభత్సం….
వీడియో తీస్తున్న జర్నలిస్టుపై కూడా దాడి
మేడిపల్లి,జూన్ 29 (మన ప్రజావాణి)బోడుప్పల్లోని దేవేందర్ నగర్ కాలనీలో గృహప్రవేశ కార్యక్రమం సందర్భంగా జరిగిన ఘర్షణ కేసులో మేడిపల్లి పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి 13 మందిని అరెస్ట్ చేశారు. నిందితులను ఈరోజు కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలించినట్లు మేడిపల్లి ఇన్స్పెక్టర్ డి. జలందర్ రెడ్డి తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 27వ తేదీ రాత్రి సుమారు 8 గంటల సమయంలో అనూప్ కుమార్ గృహప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తుండగా జరిగిన చిన్నపాటి గొడవను మనసులో పెట్టుకున్న 15 నుంచి 20 మంది వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై అక్కడికి చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న కర్రలు,హాకీ స్టిక్స్తో అనూప్ కుమార్,ఆయన కుటుంబ సభ్యులపై విచక్షణా రహితంగా దాడి చేశారు. అనంతరం అక్రమంగా ఇంట్లోకి చొరబడి ఇంటి సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు బయట పార్క్ చేసిన కార్లు,ద్విచక్ర వాహనాలను కూడా ధ్వంసం చేసి పరారయ్యారు.
ఈ ఘటనను పక్కనే నివసిస్తున్న జర్నలిస్టు విష్ణు గౌడ్ తన సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా,నిందితులు ఆయనపై కూడా దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనకు సంబంధించి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో క్రైం నంబర్లు 935/2026, 937/2026గా రెండు కేసులు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం 13 మంది నిందితులను జూన్ 28 రాత్రి అరెస్ట్ చేసి,ఈరోజు రిమాండ్కు తరలించారు.
ఈ సందర్భంగా మేడిపల్లి ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, ఘటనలో పాల్గొన్న మిగిలిన నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేవేందర్ నగర్ కాలనీలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పెట్రోలింగ్ను మరింత పెంచడంతో పాటు,గంజాయి మూకల కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.






