పట్టపగలు వృద్ధురాలు మెడలో బంగారం చోరి
గొంతు పిసికి,నోరు మూసి హత్యాయత్నం?
మెడ,ముఖం,నాలుక పై తీవ్ర గాయాలు
కేసు పెట్టకుండా పెద్ద మనుషుల ‘రాజీ’కీయం
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
పట్టపగలు ఎవరూ లేని సమయంలో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధ మహిళ ఇంట్లోకి ఓ యువకుడు ప్రవేశించి బలవంతంగా గొంతు పిసికి,నోరు మూసి మెడలో రెండు తులాల బంగారం చోరి చేసిన సంఘటన నేలకొండపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బాధితురాలు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మంగాపురం తండాకు చెందిన భూక్యా మేసి తన చిన్న కుమారుడు భూక్యా రాముడుతో కలిసి జీవిస్తుంది.సోమవారం మేసి ఇంట్లో నిద్రపోతుండగా అదే తండాకు చెందిన హరి అనే యువకుడు మధ్యాహ్నం సుమారుగా 12 గంటలు సమయంలో ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలో ఉన్న బంగారం నానుతాడు లాగే ప్రయత్నం చేయగా వృద్ధ మహిళ మేల్కొని అడ్డగించబోయింది.దీంతో ఆమె అరవకుండా గొంతు పిసికి,నోరు మూసి హత్యాయత్నం చేయగా పెనుగులాటలో ఆమె ఆ యువకుడి వేలు కొరకడంతో బంగారం తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు,కుటుంబ సభ్యులు ఆమె మెడ పై,గొంతు పై ఉన్న గాయాలను చూసి ఏమైందని ప్రశ్నించగా పూర్తి వివరాలు వెల్లడించింది.అనంతరం ఆమెను ఆటోలో తీసుకుని నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు వైద్య చికిత్స నిమిత్తం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తారు.ఈ నేపథ్యంలో దొంగతనం విషయం ఆ నోటా ఈ నోటా తండా మొత్తం దావలా వ్యాపించగా దొంగతనానికి పాల్పడిన యువకుడి కుటుంబ సభ్యులే తిరిగి ఏకంగా బాధితురాలు ఇంటిపైకి వచ్చి రాముడు భార్య పై దాడికి యత్నించారని వాపోయారు.
*షాడో సర్పంచ్ ‘రాజీ’కీయం..!*
చోరిలో భాగంగా మెడ పై గాయాలు,నాలుక మొత్తం పగిలి,నల్లగా కమిలి,ఆయాస పడుతూ మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో వృద్ధురాలు బాధపడుతుంటే మంగాపురం తండా షాడో సర్పంచ్ గా వ్యవహరిస్తున్న రాధాకృష్ణ,బాలాజీతో కలిసి రంగ ప్రవేశం చేసి నిందితుడు తరపున వకాల్తా పుచ్చుకుని
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయకుండా అడ్డుపడ్డారని బాధితులు తెలిపారు.పెద్ద మనుషులం చెబుతున్నాం మా మాట వినాలి.కేసు పెట్టవద్దని,ఒకవేళ కేసు పెడితే బంగారం రాదని మాయమాటలు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.తండాలో మాట్లాడుకుందాంమని చోరి చేసిన బంగారంతో పాటుగా నష్టపరిహారంగా పదివేలు ఇచ్చారని వెల్లడించారు.
*న్యాయం చేయాలని వేడుకోలు*
మెడలో బంగారం చోరి చేసిన సమయంలో వృద్ధురాలు నిందితుడు హరి వేలు కొరకడంతోనే బంగారం తీసుకుని పరారయ్యాడని లేకపోతే గొంతు పిసికి చంపేవాడని కన్నీటి పర్యంతమయ్యారు.పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టి న్యాయం చేయాలని వేడుకొంటున్నారు.
*చైన్ స్నాచింగ్ కేసు నమోదు చేశాం:ఎస్సై పి.సంతోష్*
వృద్ధ మహిళ మెడలో బంగారం చోరి పై ఎస్సై పి. సంతోష్ ను చరవాణిలో వివరణ కోరగా చైన్ స్నాచింగ్ కేసు నమోదు చేశామని,ఆసుపత్రిలో మెడికల్ సర్టిఫికెట్ తీసుకుని పూర్తి వివరాలు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్ కి పంపిస్తామని తెలిపారు.


