కేబుల్ ఆపరేటర్ అదృశ్యం
చెన్నారావుపేట ఏప్రిల్ 18 (ప్రజావాణి)
మండల కేంద్రమైన చెన్నారావుపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై రాజేష్ రెడ్డి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోపు శ్రీనివాస్ రెడ్డి స్థానికంగా డిసి కేబుల్ నెట్వర్క్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో బయటకు వెళ్లి వస్తాను అని ఇంట్లో చెప్పి వెళ్లిన ఆయన రాత్రి ఎంతకీ తిరిగి రాలేదు.ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు రాత్రంతా గ్రామంలోనూ, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ, బంధువుల ఇళ్లలోనూ గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. శ్రీనివాస్ రెడ్డి ఆచూకీ లభించకపోవడంతో శనివారం ఆయన భార్య గోపు మని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రాజేష్ రెడ్డి వెల్లడించారు.




