
బెజ్జంకి, మే 09(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామంలో గౌడ సంఘానికి చెందిన ఎల్లమ్మ ఆలయ భూమి వివాదం మళ్లీ చర్చనీయాంశమైంది. గ్రామ శివారులోని సర్వే నంబర్ 235లో ఉన్న 4.19 ఎకరాల భూమిని 30-12-1986న గ్రామ పెద్దల సమక్షంలో డబ్బులు చెల్లించి పత్రం రాయించుకున్నామని గౌడ కులస్తులు తెలిపారు. ఈ విషయానికి సంబంధించిన పత్రాలను ఆర్డీవో, కలెక్టర్కు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అప్పట్లో దాచారం గ్రామానికి చెందిన మంద రాజేశం గ్రామంలోని అన్ని కులాల పెద్దల సమక్షంలో రూ.2,500 తీసుకుని భూమి పత్రం రాసిచ్చాడని, ఇప్పుడు అదే భూమిపై హక్కు, చేయడం సరికాదని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. గత 40 సంవత్సరాలుగా ఈ భూమిలో ఉన్న సుమారు 500 తాడి చెట్లు, 200 ఈత చెట్ల ద్వారా గౌడ కులస్తులు జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు.ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ భూమి తమ స్వాధీనంలోనే ఉందని, ఎల్లమ్మ ఆలయానికి సంబంధించిన ఈ భూమిని వెంటనే గౌడ కులస్తుల ఆధీనంలోకి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఆనాటి పరిస్థితులు తెలిసిన స్థానిక ఉపసర్పంచ్ కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గ్రామ పెద్దల సమక్షంలోనే ఈ వ్యవహారం జరిగిన విషయమని స్పష్టం చేశారు.
అధికారులు వెంటనే స్పందించి ఎల్లమ్మ ఆలయ భూమిపై తగిన చర్యలు తీసుకుని గౌడ కులస్తులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు.

