సమస్యల పరిష్కారమే
లక్ష్యంగా ముందుకు సాగుతున్న పలాస ఎమ్మెల్యే… శిరీష
గ్రీవెన్స్లో గౌతు శిరీషకు వెల్లువెత్తిన వినతులు
రోడ్లు.. డ్రైన్లు.. పింఛన్లపై ప్రజల దరఖాస్తులు వచ్చాయి.
అధికారులతో అక్కడికక్కడే మాట్లాడిన ఎమ్మెల్యే
పలాస ప్రజావాణి ప్రతినిధి
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రత్యేక దృష్టి సారించారు. పలాసలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వ్యక్తిగత సమస్యలతో పాటు గ్రామాలు, వార్డులకు సంబంధించిన పలు ప్రజా సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు.
రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ సమస్యలు, పింఛన్లు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ప్రజలు ఎమ్మెల్యేకు దరఖాస్తులు సమర్పించారు. తమ ప్రాంతాల్లో రహదారులు అధ్వానంగా ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, డ్రైన్లు సక్రమంగా లేక మురుగునీరు నిలిచిపోతోందని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అర్హత ఉన్నప్పటికీ పింఛన్లు అందడం లేదని మరికొందరు విన్నవించారు.
ప్రజలు అందించిన ప్రతి వినతిని ఎమ్మెల్యే గౌతు శిరీష పరిశీలించారు. సమస్యల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే పరిష్కరించగల సమస్యలపై అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న అంశాలను కూడా నిబంధనల ప్రకారం పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్ర
జలు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా గ్రీవెన్స్ ద్వారా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్యలకు ప్రాధాన్యమిస్తూ రోడ్లు, డ్రైన్లు తదితర అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కేవలం స్వీకరించడమే కాకుండా వాటి పరిష్కారానికి నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే స్థానిక సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చని తెలిపారు. గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చిన పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే నేరుగా విని సంబంధిత అధికారులతో మాట్లాడటంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

