విద్యార్థుల చేత మొక్కలు నాటించి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
ప్రజావాణి – కూసుమంచి, సెప్టెంబర్ 19:
కూసుమంచి మండలం పోచారం గ్రామంలోని ఎంపీయూపీఎస్ పాఠశాలలో శనివారం నిర్వహించిన పేరెంట్స్–టీచర్స్ సమావేశం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశారు. పాఠశాలలో చదువుతున్న 34 మంది విద్యార్థులతో 34 మొక్కలను పాఠశాల ఆవరణలో నాటించారు. ఒక్కో విద్యార్థి ఒక్కో మొక్కను దత్తత తీసుకుని దాని సంరక్షణ బాధ్యతను చేపట్టేలా అవగాహన కల్పించారు.
గ్రామ సర్పంచ్ సలవాడి గురుమూర్తి నర్సరీ నుంచి మొక్కలను పాఠశాలకు అందజేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. నాగార్జున చారి, ఉపాధ్యాయులు డి. వెంకటేశ్వర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే ప్రకృతి పట్ల బాధ్యత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. మొక్కలను క్రమం తప్పకుండా సంరక్షించాలని విద్యార్థులకు సూచించారు.
విద్యార్థుల చేత మొక్కలు నాటించి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
RELATED ARTICLES

