రైతు సోదరులు మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడవద్దు: సురేందర్ రెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
దేశానికి అన్నం పెట్టే రైతు సోదరులు ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడక పంటచేలు ఎండిపోతున్నాయని మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతన్నలు మీరు ఒంటరి వారు కారు.. మీకు ప్రభుత్వం, సమాజం, మేమున్నాం ధైర్యంగా ఉండండి, జీవితం విలువైనది ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ ఉద్యమకారులు కళ్ళెం సురేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చండూరు మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రైతులతో కలిసి మాట్లాడారు. సమస్యలకు ఆత్మహత్యలే సరికాదన్నారు. రైతులు నిబ్బరం కోల్పోకుండా మనోధైర్యంతో ఉండాలని కోరారు. ప్రభుత్వం చండూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, రైతులకు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతులకు వెంటనే రైతు బీమా వచ్చేలా చూడాలని అన్నారు. చండూరు మండలంలో ఇప్పటికే అంగడిపేట, బోడంగిపర్తి గ్రామాల్లో పనస రాములు, ఎస్.కె జానీ మియా ఇప్పటికే ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుందని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు ఎర్రజల్ల లింగయ్య, రైతులు నల్ల చంద్రయ్య, కట్ట వెంకన్న, దొటి మల్లేశం, మొండికత్తి నరసింహ, చెనగాని కొండయ్య, బుచ్చాల శ్రీను, కారింగు అంజయ్య తదితరులు ఉన్నారు.

