మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బానోత్ శంకర్ నాయక్ కు శిక్షా రత్న పురస్కారం.

హుజూర్ నగర్ సెప్టెంబర్ 9 (ప్రజావాణి)
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ బానోత్ శంకర్ నాయక్ జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక ‘శిక్షా రత్న అవార్డు-2026’ అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని హరి యూనివర్సిటీ (హార్ట్ఫుల్నెస్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఉత్సవాల్లో ఆయనకు ఈ పురస్కారాన్ని ఘనంగా ప్రదానం చేశారు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐకార్-ఐఐఎమ్ఆర్ డైరెక్టర్ డా. సి. తారాసత్యవతి, హరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. ఎమ్. నర్సిరెడ్డి, మరియు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వి. బాలకిష్టారెడ్డి ల చేతుల మీదుగా ప్రిన్సిపాల్ శంకర్ నాయక్ కు ఈ పురస్కారం, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. విద్యా రంగంలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలు, పాఠశాల ప్రగతికి తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ, గ్రామీణ ప్రాంత విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఆయన కనబరుస్తున్న లీడర్షిప్ నైపుణ్యాలను గుర్తిస్తూ ‘ప్రిన్సిపాల్ (అకడమిక్ లీడర్’ )విభాగంలో ఈ అవార్డును అందజేశారు. కాగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్ గా హరి యూనివర్సిటీ వ్యవహరించగా కో-స్పాన్సర్లుగా సూపర్ ఏఐ ఫౌండేషన్, స్టడీ 9 మీడియా, ఆదాబ్ హైదరాబాద్, ఐడిల్ బ్రెయిన్, డిజిటల్ కనెక్ట్, మరియు సాక్షి ఎడ్యుకేషన్ సంస్థలు భాగస్వామ్యం వహించాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శంకర్ నాయక్ మాట్లాడుతూ ఈ జాతీయ స్థాయి పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని, మోడల్ స్కూల్ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యా ప్రమాణాలు, వసతులు కల్పించడమే ధ్యేయంగా కృషి చేస్తానని హర్షం వ్యక్తం చేశారు. జాతీయ అవార్డు సాధించిన శంకర్ నాయక్ కు విద్యాశాఖ అధికారులు, తోటి ఉపాధ్యాయులు, గ్రామస్తులు మరియు విద్యార్థులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

